అమరావతి: మాన్సాస్ ట్రస్టు కేసులో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. హైకోర్టు తాజా తీర్పుపై అప్పీలుకు వెళ్తామన్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం దేవస్థానం ఛైర్మన్గా సంచయితా గజపతిరాజుని నియమిస్తూ జారీ చేసిన జీవోని కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వివాదాన్ని కూడా సీఎంకు తెలియజేశామన్నారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సీఎం సూచించారని అన్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై కమిటీని నియమించామని, నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే పీఠాధిపతి నియామకం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో ఇవాళ ఉదయం ఉద్రికత్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

