ప్రజాశక్తి కలికిరి: కలికిరి మండలంలో ఆర్డీవో శ్రీనివాసులు సుడిగాలి పర్యటన చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం ఆయన పల్లవోలు గ్రామపంచాయతీలో జరుగుతున్న జన గణన కార్యక్రమాన్ని తహసిల్దార్ సయ్యద్ అహ్మద్ తో కలసి తనిఖీ చేశారు.
అనంతరం జన గణన సర్వే నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్ లకు జనగణన కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన గణన సర్వేలో ఎలాంటి తప్పులు జరగకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి పంచాయతీలోని అన్ని గ్రామాలలోకి వెళ్లి ఇంటింటికి వెళ్లి సమగ్ర సర్వే నిర్వహించాలని ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
క్వారీ ప్రారంభించడానికి ప్రజాభిప్రాయ సేకరణ
పల్లవోలు పంచాయతీ గడి సమీపంలో ఉన్న క్వారీని ప్రారంభించడానికి అనుమతుల కొరకు ఆర్టీవో శ్రీనివాసులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్వారీ వలన పల్లవోలు పంచాయతీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయ, క్వారీ వలన కలిగే నష్టాలు ఏంటి అని ప్రజలు అడిగి తెలుసుకున్నారు.
పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
మండలంలోని గుండ్లూరు మహల్ గుట్టపాలెం పంచాయతీల్లో తాసిల్దారు సైదులు ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని, సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో సర్వే రెడ్డప్ప, వీఆర్వో దశరథ, టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటరమణారెడ్డి, మైనార్టీ నాయకుడు సైఫుల్ల, బయన్న, రైతులు పాల్గొన్నారు.

