ముంబయి : అంతర్జాతీయ పరిస్థితుల అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం ట్రేడింగ్లో కీలక సూచీలు క్షీణించాయి. ఉదయం 9:24 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 529 పాయింట్లు పడిపోయి 73,576 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 22,813 వద్ద కొనసాగింది. ప్రారంభ దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోవడం గమనార్హం. నిఫ్టీ సూచీలో హిందాల్కో, ఓఎన్జీసీ, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి.
మరోవైపు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, మ్యాక్స్ హెల్త్కేర్, ఎటర్నల్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతుండటంతో గ్లోబల్ మార్కెట్లలో ఉద్రిక్తత నెలకొంది. హర్మూజ్ జలసంధి అంశంపై పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్న అనిశ్చితి పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతూ బ్యారెల్కు 110 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రూపాయి విలువ కూడా బలహీనపడి డాలర్తో పోలిస్తే 93.07 వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా, గ్లోబల్ టెన్షన్స్, చమురు ధరల పెరుగుదల దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

