భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు మయాంక్ అగర్వాల్. ఈ కర్ణాటక యువకెరటం అవలీలగా డబుల్ సెంచరీలు నమోదు చేస్తూ టీమిండియాలో సరికొత్త సంచలనం అయ్యాడు. ఈ నేపథ్యంలో మయాంక్ గురించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మయాంక్ ఆడింది కొన్ని టెస్టులే కాబట్టి, అతని బలహీనతలు ప్రత్యర్థులకు పెద్దగా తెలియవని, మరికొంతకాలానికి అతని గుట్టుమట్లు అన్నీ ఇతర జట్లకు తెలిసిపోతాయని, అప్పుడే అతనికి సిసలైన సవాళ్లు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మ్యాచ్ లు ఆడేకొద్దీ అతని ఆటతీరుపై ప్రత్యర్థి జట్లు ఓ అంచనాకు వచ్చి అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తాయని తెలిపారు.
అప్పటినుంచి మయాంక్ కు కష్టకాలం తప్పదని అన్నారు. ఇప్పటివరకు కెరీర్ లో 8 టెస్టులు మాత్రమే ఆడిన మయాంక్ సగటు చూస్తే మేటి బ్యాట్స్ మెన్ సైతం ఆశ్చర్యపోయేలా ఉంది. 71.5 సగటుతో 858 పరుగులు చేశాడు. వాటిలో రెండు డబుల్ సెంచరీలున్నాయి.

