ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నిర్వహించాల్సిన పలు యుజి, పిజి పరీక్షలు వాయిదా పడ్డాయి.
జిల్లా యంత్రాంగం నుంచి వచ్చిన సూచనలు, వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఒక సర్క్యులర్ విడుదల చేశారు. జులై 31, ఆగస్టు ఒకటిన నిర్వహించాల్సిన యుజి స్పెషల్ డ్రైవ్, యుజి రెండో సంవత్సరం, పిజి రెండో సెమిస్టర్, ఎల్ఎల్ఎం, బిటెక్, బిఫార్మసీ తదితర కోర్సుల పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. జూలై 31న జరగాల్సిన పరీక్షలను ఆగస్టు 3, 10, 13 తేదీలకు, ఆగస్టు 1న నిర్వహించాల్సిన పరీక్షలను ఆగస్టు 4, 8, 11, 14 తేదీలకు మార్చారు. పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పూ లేదని, ఉదయం, మధ్యాహ్న సెషన్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. తేదీ మార్చిన పరీక్షల షెడ్యూల్ను విద్యార్థులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్ తప్పనిసరిగా గమనించాలని విశ్వవిద్యాలయం సూచించింది.

