- పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి
ప్రజాశక్తి - వేంపల్లె : మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గొప్ప పరిపాలనాదక్షుడని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 113వ జయంతిని వేంపల్లెలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డి అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్ని 4 సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపినట్లు తెలిపారు. సంజీవరెడ్డి గొప్ప పరిపాలనా దక్షుడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా,ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోక్సభ స్పీకర్ , రాష్ట్రపతిగా అనేక పదవులు అలంకరించినట్లు చెప్పారు.
ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అలంకరించారని చెప్పారు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి అలంకారం తెచ్చారని అన్నారు. ఎఐసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడు అన్నారు. స్వయంకృషి, స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని, ఒక రైతు బిడ్డ రాష్ట్రపతి కాగలరని నిరూపించిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి అన్నారు. బస్సు రూట్ల జాతీయకరణ విషయమై సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నైతిక విలువలు కలిగిన నాయకుడు సంజీవరెడ్డి అన్నారు. రాజకీయ నాయకుల్లో శ్రేష్టుడు నీలం అన్నారు. లోక్సభ స్పీకరు నిష్పాక్షికంగా ఉండాలన్న ఉద్దేశంతో స్పీకర్ అయిన వెంటనే పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేశారు. భారత రాష్ట్రపతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి సంజీవరెడ్డి ఒక్కరేనని తెలిపారు.
నీలం కూడా భారతరత్న ప్రధానం చేయాలని భారత ప్రభుత్వానికి తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తన్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బండారు వెంకటేష్ , చాకిలేటి వెంకటేష్ , ఐచర్ రమణ, చిన్నకోట్ల నాగరాజు పాల్గొన్నారు.

