న్యూఢిల్లీ : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్రం డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గారంటీ కార్పోరేషన్ (డిఐసిజిసి) చట్టం 1961లో సవరణలు చేసింది. దివాళా తీసిన బ్యాంకుల నుండి కూడా ఖాతాదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించింది. వీటికి సంబంధించిన వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లో ఖాతాదారులు తమ డిపాజిట్లపై రూ.5లక్షల వరకు బీమా సౌకర్యం పొందొచ్చని అన్నారు. ప్రతిపాదిత చట్టంతో అన్ని బ్యాంక్ డిపాజిట్లకు బీమాను అందిస్తుందని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) మారటోరియం విధించిన బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్ బీమా వర్తిస్తుందని చెప్పారు.
విదేశీ బ్యాంకులు కూడా ఈ పరిధిలోకి వస్తాయని అన్నారు. తాజా సవరణలతో డిఐసిజిసి ద్వారా 98.3 శాతం ఖాతాదారులు లబ్ధి పొందుతారని అన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు యాజమాన్యంలోని డిఐసిజిసి బ్యాంకు డిపాజిటర్లకు బీమాను అందిస్తుంది. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు.
అయితే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డిఐసిజిసి నుండి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలుంటుంది. లిక్విడేషన్ పూర్తయ్యేందుకు ఎనిమిది నుండి పది సంవత్సరాలు పడుతుంది. కానీ తాజా సవరణలతో దివాళా తీసిన బ్యాంకుల నుండి 90 రోజుల్లోనే ఖాతాదారులు తమ నగదును పొందవచ్చని అన్నారు. బ్యాంకు నష్టాల్లో ఉండి..
సాధారణ కార్యకలాపాలపై ఆర్బిఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు.. ఖాతాలు స్తంభింపజేసినప్పుడు.. రూ. 5లక్షల వరకు నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుంది.

