ప్రజాశక్తి - వేపాడ : వేపాడ మండలం ఓబలయ్యపాలెం గ్రామాల పరిశుభ్రతతో పాటు ఆదాయ వనరులను పెంపొందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న "చెత్త నుండి సంపద" కార్యక్రమాలను బుధవారం సీఈఓ నాగలక్ష్మి, స్వచ్ఛ రథం అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.
సాయి హర్షలు పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన అధికారులు, అక్కడ జరుగుతున్న వర్మి కంపోస్ట్ తయారీ ప్రక్రియను సమీక్షించారు. గ్రామంలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను పూర్తిగా ఈ కేంద్రానికి తరలించి, వర్మి కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. దీనివల్ల రైతులకు ఉపయోగపడే ఎరువు సిద్ధమవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం అవుతుందని తెలిపారు.
అలాగే పొడి చెత్తను వేరు చేసి, ప్లాస్టిక్, ఇనుము, పాత పుస్తకాలు, గాజు సీసాలు వంటి వస్తువులను స్వచ్ఛ రథానికి అందించాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ వ్యర్థాలనుస్వచ్ఛ రథాలకు ఇవ్వడం ద్వారా, వ్యర్థాలకు బదులుగా ఇంట్లో ఉపయోగపడే వస్తువులను పొందే అవకాశం ఉందని వివరించారు. ఈ విధానంతో గ్రామం పరిశుభ్రంగా మారడమే కాకుండా, ప్రజలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవ్వాలంటే పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు ఈ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించడం, చెత్త వర్గీకరణను సక్రమంగా అమలు చేయించడం, కేంద్రానికి చెత్త తరలింపును పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని, తమ గ్రామాన్ని శుభ్రంగా, ఆరోగ్యవంతంగా మార్చుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

