రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్
ప్రజాశక్తి-రామభద్రపురం : విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ఇండిస్టీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ కలిసి రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలో ఉన్న ఎపిఐఐసి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా భూముల వినియోగంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాన రహదారి నుండి ఎపిఐఐసి భూములకు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా గుర్ల మండలంలో ప్రతిపాదిత సూపర్ స్మెల్టర్, డెంకాడ, భోగాపురం మండలాల్లో ఐటి హబ్కు సంబంధించిన ల్యాండ్ పార్సెల్ అంశాలను కూడా పరిశీలించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పక్క జిల్లాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల ఆర్డీవోలు, సంబంధిత మండల తహశీల్దార్లు, ఎపిఐఐసి అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

