- తిరువనంతపురంలో వివాదం
తిరువనంతపురం: తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మేయర్ వివి రాజేష్ చిత్రాలు ముద్రించడం వివాదానికి దారి తీసింది.
పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా అందించిన బ్యాగులు, నోట్బుక్లపై ఈ చిత్రాలతో పాటు "మేయర్ కేర్" అనే వ్యాఖ్య కూడా ముద్రించబడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో రాజకీయ, సామాజిక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలకు అందించే విద్యా సామగ్రిని కూడా రాజకీయ ప్రచారానికి వినియోగిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలను వ్యక్తిగత లేదా పార్టీ ప్రచార వేదికలుగా మార్చడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ వ్యవహారంపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

