అమృత్సర్/జలంధర్: పంజాబ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి జరిగిన రెండు స్వల్ప తీవ్రత గల పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అమృత్సర్, జలంధర్ నగరాల్లో కొన్ని గంటల వ్యవధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
అమృత్సర్లో ఖాసా రోడ్డులోని ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో రాత్రి పెద్ద శబ్దం వినిపించింది. ఇది స్వల్ప తీవ్రత గల పేలుడు కావచ్చని పోలీసులు తెలిపారు. గోడపైకి విసిరిన వస్తువుతో చిన్న పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరగలేదని పేర్కొన్నారు.
ఇక జలంధర్లో సాయంత్రం బీఎస్ఎఫ్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన స్కూటర్కు నిప్పంటుకుంది. కొందరు పేలుడు శబ్దం విన్నట్లు చెప్పినా, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక పేలుడు కారణమా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. బీఎస్ఎఫ్ మరియు సైన్యంతో కలిసి సంయుక్త గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

