ఉత్తరాఖండ్ : భారత్ లో త్రీవ ఇంధన కొరతకు తార్కాణంగా …. ఉత్తరాఖండ్ లో ఘటన నిలిచింది. పెట్రోల్ కోసం బంకు వద్ద శవం కూడా గంటల తరబడి ఎదురుచూసింది.. తీరా దగ్గరికెళ్లేప్పటికి నో స్టాక్ అని బోర్డు పెట్టారు ..!
శవం ఉండటమేంటి ? అనుకుంటున్నారా ? అసలేం జరిగిందంటే …. ఉత్తరాఖండ్లోని నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిధావే గ్రామంలో సర్వేశ్ కసౌధన్ అనే వ్యక్తి మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం శ్మశానానికి తరలిస్తుండగా ….
మధ్యలోనే వాహనంలో పెట్రోల్ అయిపోయింది. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వాహనాన్ని తీసుకెళ్లగా, అక్కడ అప్పటికే కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టి ఉన్నాయి. స్థానికులు, బంధువులు వెళ్లి పెట్రోల్ బంకు వారిని కలిసి పరిస్థితిని వివరించినప్పటికీ, నిబంధనల ప్రకారం …. క్యూలో రావాలని చెప్పడంతో మృతదేహం ఉన్న వాహనం దాదాపు రెండు గంటల పాటు ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది.
ఇక అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే …. అంతసేపు వేచి చూసిన తర్వాత తీరా వాహనం బంకు వద్దకు చేరుకోగానే.. స్టాక్ అయిపోయిందంటూ నిర్వాహకులు బంకును మూసివేశారు. ఈ ఘటనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. కనీసం అత్యవసర సేవలు, అంతిమ యాత్ర వాహనాలకైనా ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో వ్యవస్థలు ఉండటంపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

