టెహ్రాన్ : సోమవారం హార్మూజ్ జలసంధిలో ప్రయాణీకుల పడవలపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో పడవలో ఉన్న ఐదుగురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడిని ఇరాన్ సైన్యం ఖండించింది. అయితే ఇరాన్ సైన్యం ఆరోపిస్తున్నట్లుగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి)కు చెందిన పడవలపై కాకుండా, ప్రయాణీకుల పడవల పైనే తమ సైన్యం దాడులు జరిపిందని అమెరికా సైన్యం వెల్లడించింది.
కాగా, హోర్ముజ్ జలసంధి నుండి చిక్కుకుపోయిన నౌకలను బయటకు తీసుకువచ్చే అమెరికా మిషన్కు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించిన ఆరు ఐఆర్జిసి నౌకలను సెంట్రల్ కమాండ్ దళాలు ముంచివేశాయని సోమవారం అమెరికా సైన్యపు కమాండర్ చెప్పిన మాటలకు.. మంగళవారం అమెరికా సైన్యం ఐఆర్జిసి నౌకలపై కాకుండా.. కేవలం ప్రయాణీకుల పడవలపైనే దాడి చేశామని చెప్పిన మాటలు వాస్తవ విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే సైన్యపు కమాండర్ ఆరు ఐఆర్జిసి నౌకలని చెబితే.. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడు పడవలని చెప్పారు.
అమెరికా అధ్యక్షలు ట్రంప్ తాజాగా 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' పేరుతో సోమవారం కొత్త ప్లాన్ ను ప్రకటించారు. యుద్ధ కారణంగా హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న ఓడలను ఈ ప్లాన్ కింద అమెరికా నేవీ సురక్షితంగా బయటకు తీసుకొస్తుందని ట్రంప్ తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో మరోరకంగా ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం దాడులకు దిగుతోంది. ట్రంప్ ఏప్రిల్ 8వ తేదీన కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి స్వస్థి పలికి… మళ్లీ యుద్దానికి తెరతీశారని తెలుస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై ఇరాన్ దర్యాప్తు ప్రారంభించింది. ఐఆర్జిసి నౌకల్లో దేనికీ దెబ్బ తగలనప్పటికీ, సోమవారం ఒమన్ తీరంలోని ఖసాబ్ నుండి ఇరాన్ తీరానికి ప్రయాణికులతో వెళ్తున్న రెండు చిన్న పడవలపై అమెరికా దళాలు దాడి చేశాయని దర్యాప్తులో తేలిందని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబి పేర్కొంది. అమెరికా సైన్యం చేసిన దాడిలో పడవలు ధ్వసంమయ్యాయి. ఐదుగురు మృతి చెందారని ఇరాన్ సైన్యపు కమాండర్ తెలిపారు. ఈ నేరానికి అమెరికా జవాబుదారీగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే దీనికి అమెరికా సైన్యం నుంచి తక్షణమే స్పందన రాలేదు.

