భారీగా పోలీసుల మోహరింపు
తెల్లవారేసరికి చర్చి పాక తొలగింపు
పట్టా భూముల్లో సర్వే ఇళ్ల తొలగింపుకు మార్కింగ్
ప్రజాశక్తి - ఆకివీడు : ఆకివీడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
స్థానిక పెదపేట నుండి ఐ.భీమవరం రోడ్డులో లయన్స్ హాలు వరకు వందల సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అంతా ఆందోళనకు గురయ్యారు. ఆకివీడు పెదపేట వెనుక భాగంలో ఐ.భీమవరం రోడ్డుకు ఆనుకుని ఉండే సుమారు రెండెకరాల భూమిలో వందేళ్ల క్రితం నుంచి దళితులు వరి సాగు చేసుకునేవారు. కాలక్రమంలో ఆ భూమి క్రైస్తవ మిషనరీ సంఘాల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం అది ప్రభుత్వ పోరంబోకు భూమి అని అధికారులు, కాదు ఆ భూమి తమదేనని దళితులు, క్రైస్తవ సంఘాల మధ్య వాదన సాగుతోంది. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ భూమిపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ సోమవారం రాత్రి పోరంబోకు భూమిగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాత్రికి రాత్రి వందల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఆ స్థలంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనాలయంగా వినియోగిస్తున్న పాకలను తొలగించారు. సమీపంలో ఉన్న 17 ఇళ్ల తొలగింపునకు మార్కింగ్ వేశారు. అయితే ఆ ఇళ్లలో కొన్నింటికి గతంలోనే ప్రభుత్వం పట్టాలివ్వడం గమనార్హం. ఈ ప్రక్రియ అంతా మంగళవారం తెల్లారేసరికి అధికార యంత్రాంగం పూర్తి చేయడంతో ఆ ప్రాంతవాసులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అర్ధరాత్రి ఖాళీ చేయించడం, మార్కింగ్ సరికాదు : సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వి.గోపాలన్
సుమారు వంద సంవత్సరాలుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం ఒక్కసారిగా స్వాధీనం చేసుకోవడం సరైన విధానం కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వి.గోపాలన్ ఖండించారు. స్థానిక పెద్దపేటలో 80 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లకు మార్కింగ్ చేసి ఖాళీ చేయమనడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. అధికారులు దుందుడుకు చర్యలను ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన తహశీల్దార్కు మంగళవారం వినతిపత్రం అందించారు. అంతకుముందు మార్కింగ్ వేసిన ఇళ్లను సిపిఎం బృందం పరిశీలించింది.

