మాజీ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చట్టం ధనవంతుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఛైర్మన్, మాజీ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
విజయవాడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిసిఎల్ నాయకులు నల్లమోతు చక్రవర్తి, ఎదురూరి శ్రీనివాస్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. కాదంబరి జెత్వానిపై నమోదైన కేసు తప్పుడు వివరాలతో చేశారని, వాటికి ఉపయోగించిన పత్రాలు నకిలీవని, బ్యాక్ డేటెడ్వని సిఐడి కోర్టులో తెలిపిందని పేర్కొన్నారు, అదే పత్రాలను ఆధారంగా చేసుకుని ఆమెపైనే ఛార్జిషీట్ దాఖలు చేయడం న్యాయ, దర్యాప్తు వ్యవస్థకు పూర్తి విరుద్ధమని అన్నారు. ఒకే దర్యాప్తు సంస్థ గత దార్యాప్తు నిర్థారణలకు వ్యతిరేకంగా మరో నివేదిక ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెకు అనుకూలంగా చెప్పిన సాక్షులతోనే వ్యతిరేక సాక్ష్యం చెప్పించడం ఆందోళనకర అంశమని పేర్కొన్నారు. జిందాల్కు సంబంధించిన కేసులో తనను అన్యాయంగా ఇరికించారని కాదంబరి జెత్వాని కోర్టులో పేర్కొన్నప్పటికీ దీనిపై సిఐడి ఎటువంటి దర్యాప్తూ చేయలేదని విమర్శించారు. ఎన్నో కీలక కేసులను చేధించిన సిఐడి ఇప్పుడు రాజకీయ ప్రలోభాలకు గురవుతుందని అన్నారు. ప్రస్తుతం చట్టం అందరికీ సమానంగా అమలు కావడం లేదని, ధనవంతులకు, పలుకుబడి కలిగిన వారికి చుట్టంగా మారిపోయిందని అన్నారు. జిందాల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రూ.వందల కోట్ల ప్రోత్సాహకాలు, విద్యుత్ సబ్సిడీలు, రైల్వేమార్గం, రెండు టిఎంసిల నీటి కేటాయింపు ఇచ్చిందని తెలిపారు. సిసిఎల్ అధ్యక్షులు నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం సిసిఎల్ పోరాడుతుందన్నారు.

