ప్రజాశక్తి - విజయవాడ : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి పిచ్చయ్య చిన్న కుమారుడు, పాపులర్ షూమార్ట్, చైతన్య ఫుట్వేర్ మేనేజింగ్ పార్ట్నర్ చుక్కపల్లి విజయ్ కుమార్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి.
విజయవాడ కృష్ణలంక స్వర్గపురిలో దహన సంస్కారాలు జరిగాయి. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో గాంధీనగర్ సన్యాసిరాజు రోడ్డులోని చుక్కపల్లి షూమార్ట్ భవనం వద్ద నుండి ప్రారంభమైన అంతిమయాత్ర కృష్ణలంక స్వర్గపురి స్మశాన వాటిక వరకు సాగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆయా రంగాల్లోని ప్రముఖుల అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర జరిగింది. చుక్కపల్లి విజయ్కుమార్ జోహార్ అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామమోహన్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసిపి రాష్ట్ర నాయకులు పి.గౌతంరెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, పలువురు సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

