వాటితోనే ఎన్నికలకు వెళ్లాలని ఉత్తర్వులు
100 యుఎల్బిలకు ముగిసిన కాలపరిమితి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 33.33 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం 1994లో సెక్షన్ 6, 14 (A) ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లకు, ఎపి మున్సిపాలిటీల చట్టం, 1965లో సెక్షన్ 8, 24 ప్రకారం మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో వెనుకబడిన తరగతులకు మూడింట ఒక వంతు (33.33 శాతం) రిజర్వేషన్లను ప్రస్తుత నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం సన్నాహక కార్యకలాపాలను చేపట్టాలని సూచనలు జారీ చేసిందని, చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన సన్నాహక కార్యకలాపాలు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం పార్ట్ 9-ఏ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ద్వారా పట్టణ స్థానిక ప్రస్తుత పదవీకాలం ముగిసేలోపు కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ఆర్టికల్స్ 243-కె 243-జెడ్ఎ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం కార్యాచరణ మార్గ దర్శకాల ప్రకారం, ఆర్థిక సంఘం గ్రాంట్ల అర్హత విషయంలో పట్టణ స్థానిక సంస్థ చట్టసభల ఏర్పాటు ముఖ్యమని జిఓలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్ణీత కాలంలోనే పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్లను ఏర్పాటు చేయాల్సి ఉందని వివరిం చారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా బిసి రిజర్వే షన్ల ఫ్రేమ్వర్క్ను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 87 యుఎల్బిలకు పదవీకాలం ముగిసిందని, 13 కార్పొరేషన్లకు 2026 నవంబరుతో పదవీకాలం ముగుస్తుందని తెలిపారు. ప్రస్తుతం 100 సంస్థలకు ఎన్నికలు జరపాల్సి ఉందని తెలిపారు. మరో 23 యుఎల్బిలకు సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయని, అవి పరిష్కారమైన వెంటనే నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకునే అధికారాన్ని పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టరుకు అప్పగించారు.
బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టరుగా సంపత్
పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టరు పి సంపత్ కుమార్కు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

