సమగ్రశిక్ష డైరెక్టరు శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలను బెస్ట్ ఇన్స్టిట్యూషన్లుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రధానోపాధ్యాయులపైనే ఉందని సమగ్రశిక్ష డైరెక్టరు బి శ్రీనివాసరావు తెలిపారు.
నైపుణ్యాభివృద్ధికి హెచ్ఎంలే శిల్పులని కొనియాడారు. విజయవాడలో స్కిల్ ఎడ్యుకేషన్పై మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ విద్యా విధానం - 2020లో భాగంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లను సంపూర్ణంగా వాడుతూ, విద్యార్థులతో ప్రయోగాలు, ఎగ్జిబిషన్లు చేయించాలని ఆదేశించారు.
బోధనను రీసోర్స్ సెంట్రిక్ నుండి 'స్టూడెంట్ సెంట్రిక్'గా మార్చాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులతో పాటు క్రీడా పరికరాలు, లైబ్రరీ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలను విద్యార్థుల వికాసానికి పూర్తిస్థాయిలో సద్వినియోగించాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో స్కిల్ ఎడ్యుకేషన్ బోధిస్తున్న టీచర్లకు పూర్తి 12 నెలల వేతనం చెల్లిస్తున్నామని, వేసవి సెలవుల్లోనూ వారి సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని హెచ్ఎంలకు సూచించారు. సీమ్యాట్ డైరెక్టరు ఎంఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాభివృద్ధిని అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో 'హబ్ అండ్ స్పోక్' మోడల్ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని 1,599 పాఠశాలల్లో 11 రకాల సెక్టార్లలో ల్యాబ్లు, ఒకేషనల్ ట్రైనర్లతో శిక్షణ ఇస్తున్నామని, త్వరలో మరో 188 హబ్ స్పోక్ స్కూల్స్, ఐసిటి ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

