ప్రజాశక్తి - తిరుపతి టౌన్ : తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని గుంతకల్లు రైల్వే జనరల్ మేనేజర్ ఎస్ చంద్రగుప్త ఆదేశించారు.
తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లను బుధవారం ఆయన తనిఖీ చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ స్టేషన్ను దేశంలోనే మోడల్ స్టేషన్గా కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని తెలిపారు. ప్రయాణికులకు అన్ని రకాల వసతులు ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా పారిశుధ్య పనులతో పాటు తాగునీటి వసతి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. దక్షిణం వైపు జరుగుతున్న అభివృద్ధి పనులు చాలావరకు పూర్తయ్యాయని, మరికొంత జరగాల్సి ఉందని తెలిపారు. ఉత్తరం వైపు పనులను వేగవంతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలో వందే బారత్ స్లీపర్ రైలు తిరుపతి మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. తర్వాత రేణిగుంట రైల్వేస్టేషన్లో జరుగుతున్న రైల్వే యార్డ్ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. అంతకు ముందు రైల్వే స్టేషన్ మొత్తం ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పల సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

