చంఢీఘర్ : పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జీత్ సింగ్ చన్ని తన కేబినెట్ తుది జాబితాను ఖరారు చేశారు.
సోమవారం సిఎంగా బాధ్యతలు స్వీకరించిన చన్ని.. కేబినెట్పై రాహుల్ గాంధీతో చర్చించేందుకు ఇప్పటికే మూడు సార్లు ఢిల్లీకి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నూతన క్యాబినెట్లో మంత్రులుగా 15 మంది ఆదివారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్లోకి ఏడుగురిని కొత్తగా చేర్చగా, అమరీందర్ సింగ్ క్యాబినెట్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను తొలగించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త కేబినెట్లో కెప్టెన్ అనుయాయులు కొందరికి స్థానం దక్కగా.. మరికొందరికి నిరాశ ఎదురైంది. కెప్టెన్ వర్గీయులు మొహింద్రా, విజేంద్ర సింగ్లా, భరత్ భూషణ్లు మాత్రం తమ స్థానాలను నిలుపుకున్నారు. రాజ్కుమార్ వెర్కా, కుల్జీత్ నగ్రా, గుర్కిరత్ సింగ్ కోట్లీ, పరగత్ సింగ్, రాజా వారింగ్, రానా గుర్జీత్, సుర్జీత్ సింగ్ల పేర్లు జాబితాలో కొత్తగా చేరాయి. రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధుతో కెప్టెన్ అమరీందర్ సింగ్కి గత కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సంక్షోభాన్ని పరిష్కరించే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం దళిత వర్గానికి చెందిన చరణ్జీత్ సింగ్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పింది.

