మడకశిర రురల్ : మాజీ మంత్రి, మాజీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి బావోద్వేగానికి లోనయ్యారు. ఆయన స్వగ్రామం నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల్లో సీతారాముల కళ్యాణం సందర్భంగా బావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. నీలకంఠాపురం గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ప్రతి ఏటా 30 నుంచి 50 జంటలకు ఆలయం వద్ద ఉచిత వివాహాలను రఘువీరా దంపతులు నిర్వహించేవారు. ఈ ఏడాది కరోనా నేపథ్యం, ఆలయం జీర్ణోద్ధరణ పనులు జరుగుతుండడంతో ఉచిత వివాహాలను చేయలేకపోయారు. ఉచిత వివాహాలను చేయలేకపోతున్నందుకు ఆయన బావోద్వేగానికి లోనయ్యారు. గతాన్ని గుర్తు చేసుకున్న ఆయన సీతారాముల కళ్యాణంలో భార్య సునీతతో కలిసి కూర్చొన్న సమయంలో కంటతడి పెట్టుకున్నారు.

