* కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఎం జగన్
* కర్నూలు నుండి రెండు కార్యక్రమాలకు శ్రీకారం
* మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం
* మొదటి దశలో రూ.1129 కోట్లతో నాడు-నేడు
* రెండో దశలో పిహెచ్ కమ్యూనిటీ సెంటర్లను అభివృద్ధి
* రూ.700 కోట్లతో ఏరియల్ ఆస్పత్రుల ఆధునీకరణ
* అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నా.. కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారుచేస్తాం : సిఎం జగన్
కర్నూలు : డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశను సిఎం వైఎస్ జగన్ మంగళవారం కర్నూలులో లాంఛనంగా ప్రారంభించారు.
అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జగన్ నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం జగన్ మాట్లాడుతూ...
నేడు రెండు పథకాలను కర్నూలు నుండి ప్రారంభించడానికి శ్రీకారం చుట్టడం గర్వంగా ఉందన్నారు. మొదటిది హాస్పిటల్లో రూపు రేఖలు మార్చే కార్యక్రమమని తెలిపారు. ఇంతకు ముందు గవర్నమెంట్ బడుల రూపురేఖలను మార్చడానికి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నేడు ప్రభుత్వ హాస్పిటళ్ల రూపు రేఖలను మార్చడానికి నాడు-నేడు ద్వారా శ్రీకారం చుడుతున్నామన్నారు. నేటి నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోనివిధంగా ప్రజల సమీపంలోనే ఆసుపత్రులన్నిటినీ మార్చేందుకు, కొత్త ఆసుపత్రులను నిర్మించేందుకు ఆరోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని జగన్ ప్రకటించారు. నేషనల్ స్టాండర్డ్కు ప్రభుత్వాసుపత్రులన్నిటినీ తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదటిగా కర్నూలు నుండి ప్రారంభిస్తున్నామని జగన్ చెప్పారు.
రెండో కార్యక్రమంగా అవ్వ-తాతల కంటి వెలుగు కు శ్రీకారం చుడుతున్నామన్నారు. మూడో దశ కంటి వెలుగును ఈరోజు నుండి కర్నూలులో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. ఈ 3 వ దశలో 56.88 లక్షల మంది కి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రెండో దశలో పిహెచ్, కమ్యూనిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.700 కోట్లతో ఏరియల్ ఆస్పత్రుల ఆధునీకరణ చేపట్టనున్నామన్నారు. రూ.560 కోట్ల తో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను రూ.15,335 కోట్లతో అభివృద్ధి చేస్తామని సిఎం జగన్ ప్రకటించారు. నాడు-నేడు కార్యక్రమంలో మూడేళ్ల తర్వాత మార్పు చూడొచ్చునని తెలిపారు. మార్చి ఒకటి నుండి తాత-అవ్వలకు అవసరమైన మేరకు వైద్య చికిత్సలు, ఆపరేషన్లు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా కళ్లజోళ్ల పంపిణీ చేపడతామని సిఎం జగన్ పేర్కొన్నారు.

