సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహణ
ప్రజాశక్తి-తిరుమల : సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే సామాన్యలకు పెద్దపీట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
టిటిడి ప్రకటన ప్రకారం, బ్రహ్మోత్సవాల సమయంలో అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఈ మార్పులను య్రాతికులందరు గమనించి, టిటిడి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారి వాహన సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

