ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన్నట్లు సిఎంఒ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో రిలయన్స్ తరఫున భాగస్వామ్యం, పారిశ్రామిక రంగం అభివృద్ధి, పెట్టుబడులు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి న్నట్లు వెల్లడించింది. విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడు కింద చేపట్టిన కార్యక్రమాలు,ఇతర చర్యలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
రిలయన్స్ భాగస్వామ్యంపైనా చర్చించారు. సమావేశంలో అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ పాల్గొ న్నారు. అనంతరం ముఖేశ్, అనంత్లకు జగన్ జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న అంబానీకి అంతకుముందు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి స్వాగతం పలికి సిఎం వద్దకు తీసుకొచ్చారు.

