న్యూఢిల్లీ : తన ఆచూకీపై తీవ్రమైన ఒత్తిడి, ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉపప్రధాని, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ తాజాగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
తన ఆరోగ్యం, కొత్త ప్రభుత్వంలో పదవులకు సంబంధించి తాలిబన్ నేతల్లో విభేదాలు ఉన్నాయని మీడియా చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన వీడియోలో చెప్పారు. ''నా ఆరోగ్యం, మరణానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నేను ప్రయాణాలకు దూరంగా ఉంటున్నాను. ఈ సమయంలో ఎక్కడ ఉన్నా.. నేను బాగానే ఉన్నాను'' అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నట్లు ఎఆర్ఐ న్యూస్ మీడియా సంస్థ నివేదించింది. మీడియా ఎప్పుడూ తప్పుడు ప్రచారం చేస్తుందని, ఆ అబద్ధాలన్నింటినీ తిరస్కరించండి అని అన్నారు. కొత్త ప్రభుత్వంలో పదవులకు సంబంధించి తాలిబన్ నేతల్లో ఎటువంటి విభేదాలు, సమస్యలు లేవని 100 శాతం కచ్చితంగా చెబుతానని బరాదర్ పేర్కొన్నారు. ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి పర్యటన సమయంలో గైర్హాజరు కావడంపై స్పందిస్తూ.. ఈ పర్యటన గురించి తాను వేరే పర్యటనలో ఉన్న సమయంలో సమాచారం వచ్చిందని, అందువలనే హాజరుకాలేకపోయానని అన్నారు. ఖతార్ ప్రతినిధులతో తాలిబన్ నేతలు ఆదివారం కాబూల్లో సమావేశమైన నేపథ్యంలో బరాదర్ భవితవ్యంపై ఆ సమయంలో ఊహాగానాలు వచ్చాయి.
రాజకీయ ప్రత్యర్థుల కాల్పుల్లో బరాదర్ మరణించాడని వచ్చిన వార్తలను తాలిబన్ సోమవారం ఖండించింది. బరాదర్ కాందహార్ ప్రావిన్స్లో ఉన్నాడని, తాలిబన్ సుప్రీం నేత మౌలావి హిబతుల్లా అఖుంద్్జాదాతో సమావేశమై ఆఫ్టనిస్తాన్ భవిష్యత్తు గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. కాబూల్లోని అధ్యక్ష భవనంలో హకానీ కుటుంబంతో జరిగిన సమావేశం సందర్భంగా వాగ్వివాదం చోటుచేసుకుందని, ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో బరాదర్ మరణించాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆఫ్ఘనిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్ నేతల మధ్య వివాదం చెలరేగిందని అంతర్జాతీయ మీడియా సంస్థ వరుసగా కథనాలు రాస్తున్నది.

