చెన్నై : డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు లేఖ పంపినట్లు విశ్వసనీయ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి.
స్టాలిన్ రాజానామాను లోక్ భవన్ లోని గవర్నర్ కార్యాలయానికి పంపారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రస్తుత ముఖ్యమంత్రిని తాత్కాలిక సిఎంగా కొనసాగాలని గవర్నర్ అభ్యర్థించే అవకాశం ఉంది. డిఎంకె కూటమిలోని కీలక మిత్రపక్షాలైన విదుతలై చిరుతైగల్ కచ్చి (విసికె), వామపక్షాల నేతలు భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించేందుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ కలవనున్నట్లు సమాచారం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, రాజకీయ నాయకుడు అయిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టివికె) 107 సీట్లు గెలుచుకుని, 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీ మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది. డిఎంకె 59స్థానాల్లో విజయం సాధించింది.
స్టాలిన్ రాజకీయ కంచుకోటగా భావించే కొలత్తూరులో కూడా ఈ ఎన్నికలు అనూహ్య ఫలితాన్నిచ్చాయి. అక్కడ ఆయన టివికె అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫలితాల అనంతరం స్టాలిన్ ఎక్స్ లో స్పందించారు. తమకు మద్దతు ప్రకటించిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పు డిఎంకె నేతృత్వంలోని లౌకిక కూటమిపై కొనసాగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ కూటమికి 1.54 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయని అన్నారు. కూటమికి, గెలిచిన పార్టీకి మధ్య ఓట్ల వాటాలో అంతరం స్వల్పంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.

