
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, సిపిఎం సీనియర్ నాయకులు కొంజేటి నారాయణ (94) ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నె గ్రామానికి ఆయన భౌతికకాయం తీసుకురాగా పలువురు నాయకులు, గ్రామస్తులు నివాళులర్పించారు. సోమవారం ఆయన స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. నారాయణ మృతి పార్టీకి తీరని లోటనీ, ఎన్నో ఆటుపోట్లు, దాడులు తట్టుకున్న పలు పోరాటాల్లో పాల్గొన్నారనీ, అలాంటి గొప్ప యోధుడిని కోల్పోవడం బాధాకరమనీ జూలకంటి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పెంచికల్దిన్నె గ్రామానికి మొట్ట మొదటి సర్పంచ్గా పనిచేసిన నారాయణ.. గ్రామాభివృద్ధికి ఎంతో కృషిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకునిగా, హుజూర్నగర్ డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. చాలాకాలం సీపీఎం ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సభ్యునిగా సేవలందించారు. ఆయన సతీమణి సత్యవతి కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.