గురువారం విడుదల కానున్న "పెద్ది" చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ, సామాన్య ప్రేక్షకుడి జేబుకు మాత్రం అదనపు భారం కానుంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ.100 వరకు, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు పెంచుకోవచ్చునని జీవోలో పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించి బుధవారం రాత్రి ప్రదర్శించిన ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను ఏకంగా రూ.600 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరల పెంపు సినిమా విడుదలైన రోజు నుంచి గరిష్ఠంగా 10 రోజుల వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

