చెన్నై : తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొన్నప్పటికీ.. ఓట్ల పరంగా స్వల్ప తేడానే ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ నటుడు జోసెఫ్ సి.
విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (టివికె) 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటివరకు (ఉదయం 11:00 గంటల నాటికి) లెక్కించిన సుమారు 12.5% ఓట్లలో, టివికె సుమారు 34% ఓట్ల వాటాతో 234 నియోజకవర్గాలకు గాను 101 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. మెజారిటీ మార్కు 118కి చేరువలో నిలిచింది. డిఎంకె, ఆ పార్టీ సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (ఎస్ పి ఎ) భాగస్వామ్యులు 47 స్థానాల్లో ఆధిక్యతతో మూడవస్థానానికి పడిపోయారు. బిజెపి, పట్టాలి మక్కల్ కచ్చి (పిఎంకె) సభ్యులుగా ఉన్న అన్నాడిఎంకె కూటమి 76 స్థానాల్లో ఆధిక్యతతో రెండవ స్థానంలో నిలిచింది.
అయితే, ఓట్ల వాటా పరంగా చూస్తే, ఈ మూడు పార్టీలు దాదాపు సమాన వాటాను కలిగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. టివికె 33.7%, ఎస్ పిఎ 30.9%, అన్నాడిఎంకె కూటమి 29% ఓట్లను పొందాయి. ఓట్ల వాటాకు, సీట్ల సంఖ్యకు మధ్య నెలకొన్న అసమానతకు ప్రధాన కారణం త్రిముఖ పోటీయేనని అన్నారు. ఈ పోటీలో కొత్తగా వచ్చిన పార్టీ కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో అధికార కూటమి డిఎంకె పట్టును దెబ్బతీసిందని తెలిపారు. 2021తో పోలిస్తే 14.5 శాతం ఓట్ల వాటా క్షీణించిందని, ఎస్ పిఎ 112 సీట్లను కోల్పోయిందని అన్నారు. కౌంటింగ్ ముగిసే సమయానికి టివికె కేవలం మూడో వంతు ఓట్ల వాటాతోనైనా సొంతంగా మెజారిటీ సాధించగలిగితే, 1967 నుండి ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న ఈ రాష్ట్ర రాజకీయ నిర్మాణాన్ని ఒక కొత్త ప్రాంతీయ పార్టీ నిర్ణయాత్మకంగా మార్చిన ఎన్నికలు ఇవే కావచ్చని పేర్కొన్నారు.

