- చమురు ఆదాయంలో 4.8 బిలియన్ డాలర్ల నష్టం
టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
ఈ చర్యల ఫలితంగా ఇరాన్ గత కొన్ని నెలల్లో సుమారు 4.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 40,000 కోట్లు) చమురు ఆదాయాన్ని కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన ముడి చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు అమెరికా సముద్ర మార్గాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు విధించింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర ప్రాంతాల్లో నౌకా రవాణాపై పరిమితులు విధించడం వల్ల ఇరాన్ చమురు సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడిని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోంది. చైనాతో సహా పలు దేశాలకు చమురు సరఫరా అంతరాయం కలగడం గమనార్హం. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం, గత సంవత్సరాలతో పోలిస్తే ఇరాన్ చమురు ఎగుమతులు సుమారు 30 శాతం వరకు తగ్గాయి. ఈ తగ్గుదల ప్రపంచ చమురు మార్కెట్పై కూడా ప్రభావం చూపుతూ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి దారి తీస్తోంది. సరఫరా లోటు కారణంగా బ్యారెల్ ధరలు పెరుగుతుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇరాన్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, అమెరికా ఆంక్షలు ప్రపంచ మార్కెట్లో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

