తిరువనంతపురం : నేడు కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఎన్నికల మేనిఫెస్టోని గురువారం విడుదల చేసింది. ప్రతిక్షనాయకుడు, కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్, ఇతర యుడిఎఫ్ నాయకులు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి కూడా పాల్గొన్నారు. యుడిఎఫ్ ప్రధానంగా ఐదు హామీలనిచ్చింది. మహిళలకు ఉచిత బస్సు, కాలేజీ అమ్మాయిలకు నెలకు వెయ్యి రూపాయలు, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పేరు మీద 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం, సంక్షేమ పింఛను మూడు వేలకు పెంచడం, యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు వంటివి హామీలనిచ్చింది. ఐదేళ్లలో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఐదు లక్షల ఉద్యోగాలివ్వడం వంటి హామీలున్నాయి. అలాగే మత్స్యకారులకు సముద్ర సహాయ, గృహ నిర్మాణ ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడం. కుటుంబశ్రీ ద్వారా స్వయం ఉపాధి రుణాలను విస్తరించడం, మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను అమలు చేయడం వంటి హామీలున్నాయి.
పేదరికపు రేఖకు దిగువన ఉన్న అత్యంత నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 6వేలు అందజేత. లైఫ్ మిషన్ ప్రాజెక్టు ద్వారా అర్హులైన వారందరికి ఇళ్లు అందించి, నిరాశ్రయుల రహిత రాష్ట్రంగా మార్చనున్నట్లు యుడిఎఫ్ హామీనిచ్చింది. కిలోగ్రాములకు 35 రూపాయలు పెంచి రబ్బరు, వరికి మద్దతు ధర రూ. 250 పెంచుతూ హామీనిచ్చింది.

