బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు.ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి నేతలెన్నడూ కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. సిద్ధిపేట అభివృద్ధిని ఓర్వలేని నేతలు సిద్ధిపేటకు వచ్చి వోట్లు ఎలా అడుగుతారనీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. సిద్ధిపేటకు చెందిన ప్రశాంత్నగర్ మాజీ సర్పంచి, టిడిపి రాష్ట్ర నాయకుడు ఎల్లు రవీందర్రెడ్డి సుమారు 100మంది అనుచరులతో గురువారం మంత్రి హరీష్రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్లో చేరిన రవీందర్రెడ్డికి మంత్రి హరీష్రావు గులాబీ కండువాను కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎల్లు రవీందర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.సిద్ధిపేట అభివృద్ధిని ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన ఇతర ప్రాంతాలకు చెందిన సిద్ధిపేటకు వచ్చి వొట్లు అడిగితే ప్రజలే నిలదీసి అడగాలన్నారు. గతంలో సిద్ధిపేటలో తాగునీటి సమస్య ఎంత తీవ్రస్థాయిలో ఉండేదో ప్రజలందరికీ తెలుసుననీ, ఏ గల్లీకి వెళ్లినా ఖాళీ బిందెలతో ఆడపడుచులు ఎదురయ్యేవారనీ, మా గల్లీలో బోరు వేయించాలని కోరేవారనీ గుర్తు చేశారు. అంతేకాదూ,గతంలో సిద్దిపేటకు ఆడపిల్లను ఇయ్యాలంటే భయపడే వారనీ, దీనికి కారణం అమ్మాయితో నీళ్లు మోయిస్తారో, బోరింగ్ కొట్టించడం ద్వారా తమ ఆడబిడ్డ చేతులు దెబ్బతింటాయన్న భయంతో పిల్లను ఇచ్చేందుకు భయపడేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా?అని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ప్రస్తుతం ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించి మీ ఇంటికి మంచి నీటి నల్లా కలెక్షన్ తీసుకొచ్చిన టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఆదరించాలన్నారు. కాంగ్రెస్, బిజెపి చేయలేని అభివృద్ధిని గడిచిన ఐదారేండ్లలోనే టిఆర్ఎస్ పార్టీ చేసి మీ ఇంటి వాకిల్లలో నిలిపిందన్నారు. గతంలో సిద్ధిపేటలో మోరీలు, పందులు, మురికివాడలు మాత్రమే కనబడేవనీ. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీరు ఎక్కడ చూసినా పరిశుభ్రమైన అద్దంలాంటి గల్లీలు కనబడుతున్నాయన్నారు. బీడీ కార్మికులను, వృద్ధులను టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. ప్ర(డెలివరి)ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుండా సిద్దిపేటలో సకల సౌకర్యాలతో 400 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటుకు దీటుగా వైద్యం అందిస్తుందనీ, ప్రజా ఆరోగ్యం, ప్రజా అభివృద్ధి, పార్టీలకతీతంగా అందరూ ఈ అభివృద్ధిని కాంక్షించేది కేవలం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని మంత్రి హరీష్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి, మోహన్లాల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో కౌన్సిలర్గా నామినేషన్ వేసి.టిఆర్ఎస్లోకి.
కాంగ్రెస్కు షాకిచ్చిన వహీద్ఖాన్.
సిద్ధిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వహీద్ఖాన్ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చాడు. వహీద్ఖాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం సిద్ధిపేటలో మంత్రి హరీష్రావు సమక్షంలో గులాబీ కండువాను కప్పుకున్నారు. టిఆర్ఎస్లో చేరిన వహీద్ఖాన్కు మంత్రి హరీష్రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వహీద్ఖాన్ మాట్లాడుతూ.25యేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశాననీ, కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ కంటే సిద్ధిపేటలో మంత్రి హరీష్రావు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు మాత్రమే టిఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరిన వహీద్ఖాన్కు కాంగ్రెస్ పార్టీ పట్టణంలోని 28వ వార్డు అభ్యర్థిగా ప్రకటించింది. వహీద్ఖాన్ కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం..ఇప్పుడేమో టిఆర్ఎస్లో చేరడం కొసమెరుపు.

