Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అణు నిరాయుధీకరణకు అడ్డుగోడ అగ్రరాజ్యాల ద్వంద్వ వైఖరే

అణు నిరాయుధీకరణకు అడ్డుగోడ అగ్రరాజ్యాల ద్వంద్వ వైఖరే

"ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు తొంభై శాతం అమెరికా, రష్యా దేశాల వద్దనే ఉన్నాయి. ఒకవైపు నిరాయుధీకరణ గురించి మాట్లాడుతూనే, మరోవైపు తమ అణ్వాయుధ వ్యవస్థలను ఆధునీకరించడం ప్రపంచానికి విరుద్ధ సంకేతాలను పంపుతోంది.

అణ్వాయుధాలు తమకు అవసరమని, ఇతర దేశాలకు మాత్రం అవసరం లేదని పరోక్షంగా చెప్పే ఈ విధానం అంతర్జాతీయ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.."

డిజె మోహన రావు
8247045230 అణ్వాయుధాలు మానవాళిని ఎన్నిసార్లైనా నాశనం చేయగల శక్తిని కలిగి ఉన్నాయని ప్రపంచం ఎనిమిది దశాబ్దాల క్రితమే గ్రహించింది. అందుకే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టేందుకు, ఇప్పటికే ఉన్న ఆయుధాలను తగ్గించేందుకు అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరాయి. అయినప్పటికీ, అణ్వాయుధాలు తగ్గాల్సిన చోట మరింత ఆధునీకరించబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాంకేతిక లోపాలు కాదు. అగ్రరాజ్యాల రాజకీయ ద్వంద్వ వైఖరే.ప్రపంచ శాంతి, అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి అత్యధికంగా మాట్లాడే దేశాల్లో అమెరికా ముందుంటుంది. అయితే దాని మాటలకు, ఆచరణకు మధ్య ఉన్న అంతరమే అంతర్జాతీయ అణు వ్యవస్థపై విశ్వాసాన్ని బలహీనపరిచింది. ఇతర దేశాలు అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తే ప్రపంచ భద్రతకు ముప్పు అని హెచ్చరించే అదే అమెరికా, తన వద్ద వేలాది అణ్వాయుధాలను నిల్వ ఉంచుకోవడాన్ని జాతీయ భద్రత పేరుతో సమర్థించుకుంటుంది. ఇదే ద్వంద్వ ప్రమాణం అనేక దేశాల్లో అసంతృప్తిని పెంచింది.

మానవ చరిత్రలో యుద్ధంలో అణుబాంబును ప్రయోగించిన ఏకైక దేశం అమెరికా. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, ఆగస్టు 9న నాగసాకిపై అణుబాంబులు వేయడంతో లక్షలాది మంది అమాయక పౌరులు తక్షణమే లేదా తరువాత రేడియోధార్మిక వికిరణాల ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ విధ్వంసం మానవ నాగరికతకు చెరగని మచ్చగా మిగిలిపోయింది. యుద్ధాన్ని త్వరగా ముగించడానికే ఈ చర్య తీసుకున్నామని అమెరికా అధికారికంగా చెప్పినప్పటికీ, కొందరు ప్రముఖ చరిత్రకారులు దీనిని అప్పటి సోవియట్ యూనియన్‌కు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించిన చర్యగా కూడా విశ్లేషిస్తారు. కారణాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించిన ఏకైక దేశం అమెరికానే అన్నది మాత్రం చారిత్రక సత్యం.1968లో రూపొందిన అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విభజించిందనే విమర్శ మొదటి నుంచే ఉంది. అప్పటికే అణ్వాయుధాలు కలిగిన ఐదు దేశాలకు ప్రత్యేక హోదా కల్పించి, మిగిలిన దేశాలకు మాత్రం పరిమితులు విధించడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని అనేక దేశాలు అభిప్రాయపడ్డాయి. అణ్వాయుధ దేశాలు నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటామని ప్రకటించినప్పటికీ, ఆ దిశగా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయాయి.ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు తొంభై శాతం అమెరికా, రష్యా దేశాల వద్దనే ఉన్నాయి. ఒకవైపు నిరాయుధీకరణ గురించి మాట్లాడుతూనే, మరోవైపు తమ అణ్వాయుధ వ్యవస్థలను ఆధునీకరించడం ప్రపంచానికి విరుద్ధ సంకేతాలను పంపుతోంది. అణ్వాయుధాలు తమకు అవసరమని, ఇతర దేశాలకు మాత్రం అవసరం లేదని పరోక్షంగా చెప్పే ఈ విధానం అంతర్జాతీయ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ వ్యవస్థను బలహీనపరిచిన నిర్ణయాల్లో కూడా అమెరికా పాత్ర ప్రస్తావనీయమే. 2002లో క్షిపణి నిరోధక వ్యవస్థల పరిమితి ఒప్పందం నుంచి వైదొలగడం, 2018లో ఇరాన్‌తో కుదిరిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ఒప్పందంను విడిచిపెట్టడం, 2019లో అమెరికా-రష్యా మధ్య ఉన్న మధ్య శ్రేణి అణు క్షిపణుల నిర్మూలన ఒప్పందం ముగియడానికి దారి తీసిన పరిణామాలు ప్రపంచ భద్రతా వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపాయి. అదే సమయంలో రష్యాపై కూడా ఈ ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా పరస్పర విశ్వాసం మరింత దెబ్బతింది.ఇరాక్‌పై జరిగిన యుద్ధం అంతర్జాతీయ రాజకీయాల్లో మరో ముఖ్యమైన ఉదాహరణ. వినాశక ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణలతో యుద్ధం ప్రారంభమైనప్పటికీ తరువాత అలాంటి ఆయుధాలు కనుగొనబడలేదు. అయినప్పటికీ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు; ఒక దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా అమెరికా విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది.లిబియా, ఇరాక్ వంటి దేశాల్లో జరిగిన పరిణామాలు, అలాగే 1994లో అణ్వాయుధాలను వదులుకున్న ఉక్రెయిన్ తరువాత రష్యా దాడులను ఎదుర్కొన్న పరిస్థితి ప్రపంచ భద్రతా వ్యవస్థపై కొత్త సందేహాలను సృష్టించాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ భద్రతా హామీల విశ్వసనీయతపై విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు వ్యూహాత్మక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కొన్ని దేశాల్లో అణ్వాయుధాలే అంతిమ రక్షణ అనే భావనను బలపరిచాయి. ఇది అణ్వాయుధ నిరాయుధీకరణ లక్ష్యానికి ఎదురుదెబ్బగా మారింది.అయితే ఈ సంక్షోభానికి అమెరికా ఒక్కటే కారణమని చెప్పడం సరైంది కాదు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో అత్యధిక ప్రభావం కలిగిన దేశంగా అమెరికాపై నైతిక బాధ్యత మరింత ఎక్కువ. ప్రపంచానికి సూచించే ప్రమాణాలను ముందుగా తానే పాటించినప్పుడే ఆ నాయకత్వానికి విశ్వసనీయత లభిస్తుంది.ప్రపంచానికి ఇప్పుడు అవసరమైనది కొత్త ఆయుధాల పోటీ కాదు; కొత్త విశ్వాసం. అణ్వాయుధ దేశాలన్నీ "ఏ దేశంపైనా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించము" అనే విధానాన్ని స్వీకరించే దిశగా కదలాలి. అణుశక్తి వినియోగాన్ని పర్యవేక్షించే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలను మరింత పారదర్శకంగా, వివక్ష లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలి. అలాగే కృత్రిమ మేధస్సు ఆధారిత స్వయంచాలిత వ్యవస్థల ద్వారా అణ్వాయుధాల నియంత్రణ జరగకుండా స్పష్టమైన అంతర్జాతీయ నిబంధనలు రూపొందించాలి. అణ్వాయుధాలు ఏ దేశానికీ శాశ్వత భద్రతను ఇవ్వవు. అవి పరస్పర వినాశనాన్ని మాత్రమే హామీ ఇస్తాయి. అగ్రరాజ్యాలు తమకు ఒక న్యాయం, మిగిలిన ప్రపంచానికి మరో న్యాయం అనే ద్వంద్వ వైఖరిని విడిచిపెట్టి, నిజమైన నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేసినప్పుడే అణ్వాయుధ రహిత ప్రపంచం అనే లక్ష్యం వాస్తవ రూపం దాల్చుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News