Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎబోలా హెచ్చరిక

ఎబోలా హెచ్చరిక

ఫ్రికా దేశాలైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో మళ్లీ విజృంభిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రెయెసుస్ మంగళవారం వ్యక్తం చేసిన తీవ్ర ఆందోళన పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో తెలియజేస్తోంది.

ఇప్పటికే 130 మందికి పైగా మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా, వైరస్ వ్యాప్తి వేగం, నియంత్రణలో ఉన్న లోపాలు, ఆరోగ్య మౌలిక వసతుల బలహీనతలు ప్రపంచానికి మరో హెచ్చరికగా మారాయి.

ఎబోలా అనేది సాధారణ వైరస్ కాదు. ఇది అత్యంత ప్రాణాంతక అంటువ్యాధి. అధిక జ్వరం, రక్తస్రావం, అవయవాల వైఫల్యం వంటి తీవ్రమైన లక్షణాలతో ఈ వైరస్ బాధితులను కొద్ది రోజుల్లోనే మృత్యువాతకు నెడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సదుపాయాలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత భయానకంగా మారుతుంది. కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, పేదరికం, వైద్య సిబ్బంది కొరత, ప్రజల్లో అవగాహన లోపం కారణంగా వైరస్ నియంత్రణ అత్యంత క్లిష్టమవుతోంది.

కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి ఒక గుణపాఠం నేర్పింది. వైరస్‌లు సరిహద్దులు చూడవు. ఒక దేశంలో ప్రారంభమైన అంటువ్యాధి కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న సమస్య మాత్రమే కాదు; ప్రపంచ ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశం. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు విస్తరించిన ఈ కాలంలో అప్రమత్తత అత్యంత అవసరం.

ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు అత్యంత కీలకం. ముందుగా విమానాశ్రయాలు, సముద్రతీర నౌకాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కఠిన ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలి. ఆఫ్రికా దేశాల నుండి వొచ్చే ప్రయాణికులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అత్యంత ముఖ్యం.

భారత్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ సమయంలో అనేక రాష్ట్రాలు ఎదుర్కొన్న ఆరోగ్య సంక్షోభం ఇంకా ప్రజల మదిలోనే ఉంది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలి. జిల్లా స్థాయిలో ప్రత్యేక వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలి. వైద్యులకు, నర్సులకు, ఆరోగ్య కార్యకర్తలకు ఎబోలా లక్షణాలు, చికిత్సా విధానాలపై శిక్షణ ఇవ్వాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలు ( పీపీఈ కిట్స్ ), ఐసోలేషన్ వార్డులు, అత్యవసర ఔషధ నిల్వలను సిద్ధం చేయాలి.

ప్రజల బాధ్యత కూడా ఇక్కడ కీలకమే. ఎటువంటి వైరస్ వ్యాప్తినైనా అరికట్టడంలో ప్రజల అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనవసర భయాందోళనలకు లోనవకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. జ్వరం, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విదేశాల నుండి వొచ్చిన వారితో సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. పరిశుభ్రత, చేతులు శుభ్రం చేసుకోవడం, జనసమ్మర్థ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించడం వంటి సాధారణ ఆరోగ్య నియమాలు కూడా ప్రాణాలను కాపాడగలవు.

ఇక మీడియా పాత్ర కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. సంచలనాత్మక వార్తలతో భయాందోళనలు సృష్టించడం కాకుండా ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచే విధంగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే తప్పుడు ప్రచారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ సమయంలో ఫేక్ న్యూస్ ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రపంచం చూశింది. అదే తప్పు మళ్లీ జరగకూడదు.

అంతర్జాతీయ సహకారం కూడా ఇప్పుడు అత్యవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి, అభివృద్ధి చెందిన దేశాలు కలిసి కాంగో, ఉగాండాలకు వైద్య సహాయం, నిధులు, టీకాలు, నిపుణులను అందించాలి. పేద దేశాలు ఒంటరిగా ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోలేవు. మానవాళి మొత్తం కలిసి స్పందించినప్పుడే వైరస్‌లను అడ్డుకోవడం సాధ్యం.

ఎబోలా విజృంభణ మనకు మరోసారి గుర్తుచేస్తున్న నిజం ఏమిటంటే - ఆరోగ్య భద్రత అనేది కేవలం వైద్య రంగ సమస్య కాదు; అది ప్రపంచ ఆర్థిక, సామాజిక, మానవ భద్రతకు సంబంధించిన అంశం. ఒక చిన్న నిర్లక్ష్యం లక్షల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంది. కోవిడ్ తర్వాత ప్రపంచం మరింత సిద్ధంగా ఉండాలని భావించినా, తాజా పరిణామాలు ఇంకా అనేక లోపాలు మిగిలే ఉన్నాయని చెబుతున్నాయి.ఇప్పటికైనా అప్రమత్తత, శాస్త్రీయ దృక్పథం, సమిష్టి చర్యలతో ముందుకు సాగాలి. వైరస్‌లతో యుద్ధంలో భయం కాదు, బాధ్యతాయుతమైన చర్యలే మానవాళిని రక్షించగలవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News