Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోపించిన పోలీసు సంకల్పం ..!

లోపించిన పోలీసు సంకల్పం ..!

క వైపు అడవుల్లో నివసిస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మావోయిస్టులను "దేశ భద్రతకు ముప్పు"గా ప్రకటించి వారిపై కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించే రాష్ట్ర యంత్రాంగం ఉంది.

వారిని వెంబడించేందుకు డ్రోన్లు, ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, భారీ పోలీసు మోహరింపులు జరుగుతాయి. మరోవైపు, ఒక నగల దుకాణంలో చోరీ జరిగితే గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాలు, కాల్ డేటా, వాహనాల కదలికలు, టెక్నాలజీ సహాయంతో నిందితులను రాష్ట్రాల సరిహద్దులు దాటి పట్టుకొచ్చే సామర్థ్యం కూడా ఇదే పోలీసు వ్యవస్థకు ఉంది.

అయితే మైనర్ బాలికపై అత్యాచారం కేసులో హైకోర్టు బెయిల్ నిరాకరించిన వ్యక్తి ప్రజల్లోనే తిరుగుతున్నా, అతడిని అరెస్ట్ చేయడంలో జరుగుతున్న ఆలస్యం మాత్రం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. "నిందితుడు అందుబాటులో లేడు" అనే వాదన ప్రజలను నమ్మించే స్థితిలో లేదు. ఎందుకంటే సాధారణ పౌరుల విషయంలో పోలీసులు చూపే చురుకుదనం ఇక్కడ కనిపించడం లేదు.

ఇది కేవలం ఒక వ్యక్తి అరెస్ట్ వ్యవహారం మాత్రమే కాదు. ఇది చట్ట వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం. ఒక సాధారణ యువకుడు ఇలాంటి కేసులో నిందితుడైతే పోలీసులు అతడిని మీడియా ముందు పరేడ్ చేసి, కుటుంబ సభ్యుల పై ఒత్తిడి తీసుకొచ్చి, రోజుల్లోనే అరెస్టు చేసి జైలుకు పంపేవారు. కానీ రాజకీయ ప్రభావం ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల విషయంలో విచారణ గతి ఒక్కసారిగా మందగించడం ప్రజాస్వామ్య సమానత్వ భావనను దెబ్బతీస్తోంది.

ఇక్కడ అత్యంత ఆందోళనకర అంశం బాధితురాలు మైనర్ కావడం. దేశంలో మహిళల భద్రత, బాలికల రక్షణపై రోజూ సభల్లో ప్రసంగాలు చేసే రాజకీయ నాయకత్వం, "బేటీ బచావో" నినాదాలు ఇచ్చే ప్రభుత్వ వ్యవస్థ, ఇలాంటి కేసుల్లో మాత్రం ఎందుకు మౌనంగా కనిపిస్తుందన్న ప్రశ్న సమాజాన్ని వెంటాడుతోంది. పోక్సో చట్టం అత్యంత కఠినమైనది. మైనర్లపై లైంగిక దాడులను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ప్రత్యేక రక్షణ కల్పించేందుకే ఈ చట్టం తీసుకొచ్చారు. కానీ చట్టం కఠినత కేవలం పుస్తకాలకే పరిమితమై, అమలులో మాత్రం రాజకీయ ప్రభావాలు పనిచేస్తే అది న్యాయవ్యవస్థ ఆత్మను దెబ్బతీసినట్లే అవుతుంది.

హైకోర్టు బెయిల్ నిరాకరించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్టు ముందు ఉన్న ప్రాథమిక ఆధారాలు, కేసు తీవ్రత, విచారణ అవసరాలను పరిగణనలోకి తీసుకున్నాకే అలాంటి నిర్ణయం వొస్తుంది. అలాంటి సందర్భంలో అరెస్టు జరగకపోవడం అంటే దర్యాప్తు సంస్థల పనితీరుపై సహజంగానే అనుమానాలు పెరుగుతాయి. ఇది ప్రజల్లో "రాజకీయ శక్తి ఉంటే చట్టాన్ని కూడా తప్పించుకోవొచ్చు" అనే ప్రమాదకర భావనకు దారితీస్తుంది.

ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ తటస్థంగా ఉండాలి. అధికార పార్టీకి చెందిన వారైనా, ప్రతిపక్షానికి చెందిన వారైనా, సామాన్యులైనా - నేరం ముందు అందరూ సమానమనే నమ్మకం నిలబడాలి. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే పోలీసులు రాజకీయ అధికారానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. నిరసనలు చేసే విద్యార్థులపై, కార్మికులపై, రైతులపై వేగంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేసే వ్యవస్థ, రాజకీయ బలం ఉన్న నిందితుల విషయంలో మాత్రం "పరిశీలనలో ఉంది", "దర్యాప్తు కొనసాగుతోంది" అనే మాటలతో కాలయాపన చేస్తోంది.

ఇది ఒక్క తెలంగాణ లేదా ఒకే పార్టీ సమస్య కాదు. దేశవ్యాప్తంగా అధికార ప్రభావం ఉన్న కేసుల్లో ఇలాంటి ధోరణి పదేపదే కనిపిస్తుంది. దాంతో ప్రజల్లో చట్టపరమైన న్యాయం కన్నా రాజకీయ సంబంధాలే ముఖ్యమనే నిస్పృహ పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే చట్టం పై నమ్మకం కోల్పోయిన సమాజం చివరికి అసంతృప్తి, అన్యాయం, ఆగ్రహం వైపు నెట్టబడుతుంది.

పోలీసు వ్యవస్థ సామర్థ్యంపై ఎవరికి సందేహం లేదు. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్, డిజిటల్ ట్రాకింగ్ సామర్థ్యాలు - ఇవన్నీ దేశంలో గణనీయంగా పెరిగాయి. గంటల్లో నిందితులను గుర్తించే స్థాయికి విచారణ పద్ధతులు అభివృద్ధి చెందాయి. అలాంటి పరిస్థితిలో ఒక ప్రముఖ వ్యక్తి కుమారుణ్ణి అరెస్టు చేయలేకపోవడం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ అసలు సమస్య సామర్థ్యం కాదు, సంకల్పం. చట్టాన్ని అమలు చేయాలనే నిజమైన సంకల్పం ఉన్నదా లేదా అన్నదే అసలు ప్రశ్న.

ఈ వ్యవహారంలో మీడియా పాత్ర కూడా కీలకం. అధికార అనుకూల మీడియా ఇలాంటి అంశాలను పక్కనపెట్టి మౌనం పాటిస్తే, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం తన బాధ్యతను విస్మరించినట్టే అవుతుంది. బాధితురాలి న్యాయం కోసం నిలబడాల్సిన సమాజం, రాజకీయ లాభనష్టాల లెక్కల్లో మునిగిపోతే అది మరింత ప్రమాదకరం. మహిళల భద్రత, బాలల హక్కులు పార్టీ రాజకీయాలకు అతీతమైన అంశాలు కావాలి.

చట్టపరమైన వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలవాలంటే ఒకే ఒక మార్గం ఉంది - పారదర్శకత మరియు సమానత్వం. కేసు ఎవరికి సంబంధించినదైనా, విచారణ వేగంగా, నిష్పక్షపాతంగా జరగాలి. నిందితుడు అధికార కుటుంబానికి చెందినవాడా, సామాన్యుడా అన్న తేడా లేకుండా చట్టం ఒకేలా పనిచేయాలి. లేకపోతే "న్యాయం" అనే భావన క్రమంగా ప్రజల మనసుల్లో చనిపోతుంది.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ బలం కేవలం మెజారిటీతో కాదు, చట్టాన్ని సమానంగా అమలు చేసే నైతిక ధైర్యంతో కొలవాలి. ఒక మైనర్ బాలికకు న్యాయం చేయడంలో ఆలస్యం జరిగితే అది కేవలం ఒక కేసు ఆలస్యం కాదు - అది రాజ్యాంగ విలువలకే పరీక్ష. ఈ పరీక్షలో వ్యవస్థ విఫలమైతే ప్రజల విశ్వాసం తిరిగి పొందడం చాలా కష్టం …

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News