పీవీఆర్ న్యూస్, హైదరాబాద్, జూలై 14,2026: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (72) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం వ్యక్తమవుతోంది.
దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ముద్రగడ క్రియాశీలక పాత్ర పోషించారు. కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆయన చేపట్టిన ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన శాసనసభ్యుడిగా (ఎమ్మెల్యే), పార్లమెంట్ సభ్యుడిగా (ఎమ్మెల్యే), మంత్రిగా ప్రజలకు సేవలందించారు.
రాజకీయ ప్రముఖుల సంతాపం..
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, ప్రజాసేవను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముద్రగడ మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ముద్రగడ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు.

