అమెరికా చరిత్రలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
అమెరికా తన 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ట్రంప్ చిత్రంతో కూడిన ప్రత్యేక బంగారు నాణేలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇప్పుడు 250 డాలర్ల ప్రత్యేక కరెన్సీ నోటును కూడా ముద్రించాలని భావిస్తోంది. అమెరికా కరెన్సీ రూల్స్ ప్రకారం.. 1866వ సంవత్సరం తర్వాత జీవించి ఉన్న ఏ వ్యక్తి చిత్రం కూడా అమెరికన్ డాలర్లపై ఉండకూడదు.
రూల్స్ మార్చేలా ప్రయత్నాలు..
ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించేలా లేదా మినహాయింపు ఇచ్చేలా అమెరికా కాంగ్రెస్ అనుమతి పొందడానికి అధికారులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే.. సుమారు 160 ఏళ్ల చరిత్రలో జీవించి ఉన్న వ్యక్తి ఫోటోతో అమెరికా కరెన్సీ విడుదల కావడం ఇదే మొదటిసారి అవుతుంది. అయితే ఈ నోట్ల నమూనాలను రెడీ చేయమని.. అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్, బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ సిబ్బందిని ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
ప్రస్తుతం అమెరికా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగ దరఖాస్తుల సంఖ్య 2,15,000కు పెరిగింది. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదల. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం కూడా ఆందోళన కలిగిస్తోంది. 2025 ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ఏప్రిల్లో ద్రవ్యోల్బణం ఏకంగా 3.8 శాతానికి పెరిగింది. ఇది గత మూడేళ్లలోనే గరిష్ట స్థాయిగా పెరిగింది. ఈ సమయంలో 250 డాలర్ల కరెన్సీ నోటు తీసుకురావడంతో విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

