Dailyhunt
Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

RTV News 1 week ago

Anchor Reshmi : జంతు ప్రేమికురాలిగా గుర్తింపు పొందిన సినీ నటి, యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది.

మూగజీవాల పట్ల చూపుతున్న క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతను నిరసిస్తూ తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ఒక ఎడ్లబండిపై ఆటోను ఎక్కించి, దానిపై భారీ సంఖ్యలో కార్యకర్తలతో ఊరేగింపు నిర్వహించారు. ఆ బరువును మోయలేక ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన రష్మి.. "మీ రాజకీయ ఉనికి కోసం మూగజీవాలను హింసించే హక్కు ఎవరికీ లేదు. ఆ ఎద్దు పడిన వేదన కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వేదనను మీరు అనుభవించాలి" అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

రష్మి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్, ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగింది. ఆమె గతంలో నటించిన సినిమాల్లోని క్లిప్పింగులను, గ్లామర్ షోలను ప్రస్తావిస్తూ అత్యంత జుగుప్సాకరమైన భాషలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. "ప్రజల కష్టాలు పట్టవు కానీ జంతువుల గురించి మాట్లాడుతావా?" అంటూ కొందరు, "రాజకీయాల్లో తలదూర్చవద్దు" అంటూ మరికొందరు హెచ్చరికలకు దిగారు. రష్మి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. "నేను నటించిన సినిమాలకు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. వృత్తి వేరు, వ్యక్తిగత విలువలు వేరు. షూటింగ్స్లో కూడా యానిమల్ వెల్ఫేర్ బోర్డు నిబంధనలు పాటిస్తాం" అని స్పష్టం చేశారు. "నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాను. కోడి పందాలకు భారీ ఆఫర్లు వచ్చినా వెళ్లని చరిత్ర నాది" అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. రష్మికి మద్దతుగా టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో అండగా నిలుస్తున్నాయి. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడమే కాకుండా, ప్రశ్నించిన మహిళా సెలబ్రిటీపై అసభ్యంగా ప్రవర్తించడం వైసీపీ నాయకుల మనస్తత్వానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు నిబంధనల ప్రకారం అభినయ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జంతు హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి రష్మి వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా వార్ నెట్టింట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu