యుద్ధంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అమెరికా ఫైటర్ జెట్లను ఇరాన్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తోంది. నైరుతి ఇరాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది.
కూలిన విమానం నుంచి పైలట్ పారాచూట్ సహాయంతో కిందకు దూకినట్లు వార్తలు వస్తున్నాయి. అతడిని పట్టుకునేందుకు ఇరాన్ సైన్యం, పౌరులు రంగంలోకి దిగారు. అమెరికా పైలట్ని ప్రాణాలతో పట్టుకోవాలని ఇరాన్ సర్కార్ ఆదేశించింది.
పైలట్ను పట్టుకుంటే భారీ బహుమతి!
ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ ఐఆర్ఐబి (IRIB) ఈ ఘటనపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తోంది. "శత్రు పైలట్ను సజీవంగా పట్టుకుని పోలీసులకు లేదా సైన్యానికి అప్పగిస్తే విలువైన బహుమతి అందజేస్తాం" అని ప్రకటించారు. పైలట్ను వెతకడానికి వందలాది మంది పౌరులు తమ ప్రైవేట్ వాహనాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటున్నట్లు సమాచారం. అయితే, పైలట్ను ఎవరూ హింసించవద్దని ఇరాన్ సాయుధ దళాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
కూలిన విమానాలు ఏవి?
ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, ఈ పోరులో అమెరికాకు చెందిన రెండు రకాల శక్తివంతమైన విమానాలు కుప్పకూలాయి. మధ్య ఇరాన్ పైన ఎగురుతున్న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూల్చివేసినట్లు తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన శకలాల చిత్రాలను కూడా విడుదల చేసింది. అలాగే మరో F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని కూడా పేల్చేశామని తెలిపారు. బ్రిటన్లోని ఆర్ఏఎఫ్ లేకెన్హీత్ నుంచి వచ్చిన ఈ విమానాన్ని కూడా కూల్చివేశామని, విమానం తోక భాగం శకలాలు దీనిని ధృవీకరిస్తున్నాయని ఇరాన్ వెల్లడించింది.
అమెరికా ఏమంటోంది?
ఇరాన్ చేస్తున్న ఈ ఆరోపణలను యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తీవ్రంగా ఖండించింది. గతంలో కూడా ఇరాన్ ఇలాంటి తప్పుడు ప్రకటనలు అరడజను సార్లు చేసిందని ఎద్దేవా చేసింది. "మా యుద్ధ విమానాలన్నీ క్షేమంగా ఉన్నాయి, ఏ ఒక్కటీ అదృశ్యం కాలేదు" అని సెంటకామ్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి F-35ని కూల్చామని ఇరాన్ ప్రకటించడం ఇది మూడవసారి కావడం గమనార్హం. ప్రస్తుతానికి పెంటగాన్ లేదా వైట్ హౌస్ నుంచి అధికారికంగా ఎటువంటి రాతపూర్వక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇరాన్ క్లెయిమ్ నిజమైతే, ఇది రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

