కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై బ్యాన్ విధించింది. అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచింది.
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దిగుమతుల ఖర్చును తగ్గించుకోవడానికి, విలువైన లోహాల వ్యాపారంపై పర్యవేక్షణను పెంచడానికి కేంద్రం ఈ అడుగు వేసింది.
ఒక లైసెన్స్ మీద పన్ను లేకుండా గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా, మొదటిసారి ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారి తయారీ కేంద్రాలను అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. గతంలో లైసెన్స్ పొంది మళ్లీ దరఖాస్తు చేసుకునే వారి కోసం కూడా కఠినమైన నియమాలను తెచ్చారు. పాత లైసెన్స్ కింద తాము చేయాల్సిన ఎగుమతుల్లో కనీసం 50 శాతాన్ని పూర్తి చేస్తేనే వారికి కొత్తగా అనుమతులు మంజూరు చేస్తారు.
పన్ను లేకుండా బంగారాన్ని దిగుమతి చేసుకునే ఎగుమతిదారులు ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి తమ వ్యాపార లావాదేవీల వివరాలను చార్టర్డ్ అకౌంటెంట్ చేత ధృవీకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ప్రాంతీయ అధికారులు ప్రతి నెలా నివేదిక రూపంలో డీజీఎఫ్టీ ప్రధాన కార్యాలయానికి పంపుతారు. అక్కడ కేంద్ర అధికారులు వీటిని నిరంతరం పర్యవేక్షిస్తారు.

