చెన్నూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదు.
సంధ్యారాణి ఘనవిజయం
గత కొన్ని రోజులుగా హైటెన్షన్ మధ్య కొనసాగిన క్యాతనపల్లి మున్సిపల్ పీఠం ఎట్టకేలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ వశమైంది. ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గొడిసల సంధ్యారాణి ఘనవిజయం సాధించారు. మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. కేవలం ఛైర్మన్ పదవినే కాకుండా, వైస్ చైర్మన్ పదవిలోనూ విపక్ష కూటమి పట్టు సాధించింది.
బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ వ్యూహాలను చిత్తు చేస్తూ బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ఐక్యంగా నిలిచి ఈ విజయాన్ని అందుకున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో పట్టున్న వివేక్ వెంకటస్వామికి ఇది రాజకీయంగా పెద్ద షాక్ అని చెప్పాలి. గెలుపు వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం కూడా బీఆర్ఎస్
మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన టెకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు సుదర్శన్ రెడ్డికి లభించడంతో ఎన్నికల అధికారులు ఆయనను చైర్మన్గా ప్రకటించారు. ఇబ్రహీంపట్నం విజయంతో కలిపి, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గెలుచుకున్న మున్సిపాలిటీల సంఖ్య 20కి చేరింది.

