Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Big breaking : సీఎం విజయ్‌కు వరుస తలనొప్పులు...మంత్రివర్గ ఏర్పాటులో గందరగోళం

Big breaking : సీఎం విజయ్‌కు వరుస తలనొప్పులు...మంత్రివర్గ ఏర్పాటులో గందరగోళం

RTV News 4 days ago

Big breaking : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మిత్రపక్షాల మద్దతుతో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ (TVK చీఫ్) నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పుడే రాజకీయ సెగలు మొదలయ్యాయి.

అన్నాడీఎంకే (AIADMK) తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది. ఈ వ్యవహారంపై మిత్రపక్షాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో, ప్రభుత్వం తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే (AIADMK) రెబల్ ఎమ్మెల్యేలను క్యాబినెట్ లోకి తీసుకుంటున్నారనే వార్తలు గుప్పుమనడంతో మిత్రపక్షాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా కూటమిలోని కీలక భాగస్వామి అయిన వీసీకే (VCK) అధినేత తిరుమావళవన్ ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. అన్నాడీఎంకే రెబల్ నేతలకు గనుక మంత్రివర్గంలో చోటు కల్పిస్తే, తాము విజయ్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకునే అంశంపై పునరాలోచించాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. వామపక్షాలు (సీపీఐ, సీపీఎం) సైతం వీసీకే గళానికి మద్దతు పలికాయి. అన్నాడీఎంకేలోని ఏ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకున్నా అది తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే అవుతుందని మిత్రపక్షాలు స్పష్టం చేశాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయింది. మిత్రపక్షాల అండతోనే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమైంది. టీవీకే (TVK) ఒంటరిగా108 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మిత్రపక్షాలు (కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్, ఐయూఎంఎల్)కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు అన్నాడీఎంకే (AIADMK) రెబల్స్ బలపరీక్షలో మద్దతు ఇచ్చారు. దీంతో మొత్తం మద్దతు (బలపరీక్ష నాటికి)144 కు చేరుకుంది. బలపరీక్ష సమయంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వ బలం 144కు చేరినప్పటికీ, వారిని క్యాబినెట్ లోకి తీసుకోవడం మిత్రపక్షాలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.

మిత్రపక్షాల నుండి ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో టీవీకే అప్రమత్తమైంది. ఈ వివాదానికి తెరదించుతూ తమిళనాడు మంత్రి అధవ్ అర్జున అధికారికంగా స్పష్టత ఇచ్చారు."అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలు, అసత్య ప్రచారాలు మాత్రమే. ఈ విషయమై మేము ఇప్పటికే మా మిత్రపక్షాలతో మాట్లాడి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాము. కూటమి సజావుగానే సాగుతుంది." అని అధవ్ అర్జున స్పష్టం చేశారు, తమిళనాడు మంత్రి ఇచ్చిన ఈ వివరణతో ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వానికి ఎదురైన మొదటి పెద్ద రాజకీయ తలనొప్పి తాత్కాలికంగా సర్దుమణిగినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ, భవిష్యత్తులో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విషయంలో సీఎం విజయ్కు మిత్రపక్షాల ఒత్తిడి ఎలా ఉండబోతుందనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu