Cockroach Janata Party : సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, ప్రస్తుతం దేశవ్యాప్త సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది.
డిజిటల్ ఉద్యమంగా, ఒక మీమ్ (Meme) రూపంలో ప్రారంభమైన ఈ ప్రస్థానం.. ఇప్పుడు వీధిపోరాటాలకు సిద్ధమైంది. NEET-UG, CBSE వంటి ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా ఒక భారీ ఆందోళనను చేపట్టేందుకు ఈ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జూన్ 6న అమెరికా నుండి ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజల్లోకి ,మీడియాలోకి పార్టీ గళాన్ని బలంగా తీసుకెళ్లడం కోసం సౌరభ్ దాస్, విజేత దహియా, ఆశుతోష్ రాంకా అనే ముగ్గురు విద్యావంతులను పార్టీ అధికారిక ప్రతినిధులుగా నియమించారు.
బుధవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ ముగ్గురు ప్రతినిధులు తమ మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 6న పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టేందుకు అనుమతి కోరతామని వారు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా పుట్టిన ఈ వినూత్న పార్టీ నియమించిన ముగ్గురు కీలక ప్రతినిధులు ఎవరు? వారి నేపథ్యం ఏమిటనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ముఖ్య అధికారిక ప్రతినిధి - సౌరవ్ దాస్: కాక్రోచ్ జనతా పార్టీ తన ప్రధాన అధికారిక ప్రతినిధిగా సౌరవ్ దాస్ను నియమించింది. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన సౌరవ్.. ప్రధానంగా చట్టపరమైన, న్యాయవ్యవస్థ ,సామాజిక అంశాలపై నిరంతరం కాలమ్లు రాస్తుంటారు. జర్నలిజంతో పాటు ఆయన ఒక సామాజిక కార్యకర్త (సోషల్ యాక్టివిస్ట్) కూడా. నవంబర్ 2025లో ఇండియా గేట్ వద్ద జరిగిన కాలుష్య వ్యతిరేక నిరసనల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా కీలక విషయాలను వెలికితీసి నివేదికలు రాయడంలో ఆయన సిద్ధహస్తుడు. ముఖ్యంగా కోవిడ్-19 కాలంలో 'ఆరోగ్య సేతు' యాప్ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన లొసుగులను ఆర్టీఐ, కోర్టు విచారణల ద్వారా బహిర్గతం చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ప్రతినిధి , స్క్రిప్ట్ రైటర్ - విజేత దహియా: పార్టీ మరో ప్రతినిధిగా నియమితుడైన విజేత దహియా హర్యానాకు చెందినవారైనప్పటికీ, ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థ 'ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ' (DTU) నుండి పట్టా పొందిన ఆయన.. రాజకీయ పరిశోధకుడు, రచయిత ,ఫిల్మ్ మేకర్గా రాణిస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) కి రీసెర్చర్గా, స్క్రిప్ట్ రైటర్గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. 'కోరా' (Quora) హిందీ ప్లాట్ఫారమ్లో రాజ్యాంగం, చరిత్ర, సినిమా వంటి అంశాలపై లోతైన విశ్లేషణలు రాస్తూ 'ఉత్తమ రచయిత'గా ఎంపికయ్యారు. ఈయన రాసిన ‘పవర్ ఆఫ్ యూనివర్స్’, ‘టూ హెల్ విత్ దట్ జాబ్’ అనే పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్గా నిలిచాయి. అలాగే ‘దరారే’, ‘ఓప్రీ పరాయి’ అనే హరియాణ్వి చిత్రాలకు కథ అందించి దర్శకత్వం కూడా వహించారు.
విద్యావేత్త , పబ్లిక్ పాలసీ నిపుణుడు - ఆశుతోష్ రాంకా: మరొక ప్రతినిధి ఆశుతోష్ రాంకా అత్యున్నత విద్యా నేపథ్యం కలిగిన యువకుడు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) నుండి బీటెక్ పూర్తి చేసిన ఆయన, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రపంచ ప్రసిద్ధ కన్సల్టింగ్ సంస్థ 'మెకిన్సే' (McKinsey) లో పనిచేసిన అనుభవం ఈయన సొంతం. గత ఏడాది లండన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన ఆశుతోష్.. జైపూర్లో పర్యావరణం, విద్య, యువతకు సంబంధించిన పలు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. డోల్ కా బాద్ వివాదం, అమాయరా ఆత్మహత్య కేసు, నీట్ పేపర్ లీకేజీ వంటి అంశాలపై ఆయన నిరంతరం పోరాడుతున్నారు. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ తరఫున దేశ విద్యా వ్యవస్థలో (NEET, CBSE) పారదర్శకత తేవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే, సోషల్ మీడియా నెటిజన్ల మద్దతుతో దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా पार्टी (CJP).. కేవలం ఇంటర్నెట్ ముచ్చట్లకే పరిమితం కాకుండా, దేశ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఉన్నత విద్యావంతులు, జర్నలిస్టులు, సామాజిక స్పృహ ఉన్న యువతను తమ ప్రతినిధులుగా నియమించుకోవడం ద్వారా ఈ పార్టీ దేశ రాజధానిలో పటిష్టమైన రాజకీయ ముద్ర వేయాలని భావిస్తోంది. జూన్ 6న జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసన ప్రదర్శన ఈ పార్టీ భవిష్యత్తును , దేశ రాజకీయాల్లో వీరు చూపించబోయే ప్రభావాన్ని నిర్ణయించనుంది.

