ఇండియా,పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను ఉద్దేశించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ భవిష్యత్తులో భారత్ తమపై ఏదైనా సైనిక చర్యకు పాల్పడితే, ఆ యుద్ధాన్ని తాము ఏకంగా కోల్కతా వరకు తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి.
తాజాగా సియాల్కోట్లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ తమ దేశంపై తప్పుడు కారణాలతో దాడి చేయడం ఆపరేషన్లకు ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ ఈసారి భారత్ అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే, తాము ఊరుకోమని, యుద్ధ రంగం కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, అది కోల్కతా వరకు విస్తరిస్తుందని ఘాటుగా స్పందించారు.
భారత్ గట్టి బుద్ధి
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల చేసిన హెచ్చరికలకు ప్రతిస్పందనగానే పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే భారత్ గట్టి బుద్ధి చెబుతుందని రాజ్ నాథ్ సింగ్ గతంలో హెచ్చరించారు. దీనిపై స్పందిస్తూ, గత ఏడాది జరిగిన ఘర్షణల కంటే ఈసారి తమ స్పందన చాలా బలంగా ఉంటుందని ఆసిఫ్ చెప్పుకొచ్చారు.
అయితే, పాకిస్థాన్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై భారత రక్షణ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. తమ దేశంలో ఉన్న అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే పాక్ మంత్రులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, కోల్కతా వంటి నగరాన్ని లక్ష్యం చేసుకుంటామన్న పాక్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

