తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తు్న్న రైతు భరోసా(rythu bharosa 2026) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలనే మొదటి విడత నిధులు విడుదల( rythu bharosa amount release) చేసిన ప్రభుత్వం రెండో విడత రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధం అవుతోంది.
ఇందుకు అవసరమైన రూ.2,650 కోట్ల నిధులను సమీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు ఉద్యోగుల జీతాలు, అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు పోనూ మిగిలిన వాటిని రైతు భరోసా రెండో విడతకు మళ్లించేందుకు కసరత్తు చేస్తున్నారు.ఈ మేరకు అధికారులు రైతుభరోసాకు కావాల్సిన నిధులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మూడు విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Second Tranche Of Farmer Assurance Be Released
మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రూ.3,590 కోట్లను చెల్లించింది. దీంతో సుమారు 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో రైతు భరోసాను జమ చేసింది. రెండో విడత నిధులను ఈనెల 2వ వారంలో జమచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫాలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు చెల్లించాల్సిన నిధులను ఈనెల చివరన చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్లో రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున పంటసాగు కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం రూ.9 వేల కోట్ల వరకు వెచ్చిస్తోంది. నిజానికి గతంలో ఒకేసారి రైతు భరోసా చెల్లించినప్పటికీ ఆర్థిక వనరుల కొరత కారణంగా ఈసారి మూడు దఫాలుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

