Telangana Bhavan : తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ ఇచ్చిన తెలంగాణ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో ఉన్న బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ఉద్యమకారుల జేఏసీ పేరుతో కొంతమంది ఈ రోజు భవన్ను ముట్టడించడమే కాకుండా జేఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాధనకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమిస్తే, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన కారులు ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. పలువురు ఉద్యమకారులు తెలంగాణ భవన్ లోపలికి చొచ్చుకుపోవడానికి వారు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను అక్కడికి తరలించారు పోలీసులు. పలువురిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాగా, తమను అదుపులోకి తీసుకోవడం పట్ల పోలీసుల తీరుపై ఉద్యమకారుల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ఆందోళన చేశారు. ఉద్యమకారుల ఆందోళనతో తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

