Dailyhunt
West Bengal elections : ఈవీఎంలపై టేపులు.. భారీగా రిగ్గింగ్.. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం-VIDEO

West Bengal elections : ఈవీఎంలపై టేపులు.. భారీగా రిగ్గింగ్.. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం-VIDEO

RTV News 1 week ago

West Bengal elections : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో , తుది విడత పోలింగ్ బుధవారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది.

ముఖ్యంగా డైమండ్ హార్బర్ నియోజకవర్గ పరిధిలోని ఫల్తా ప్రాంతంలో ఈవీఎంలపై బీజేపీ గుర్తు ఉన్న బటన్లను టేపులతో కప్పివేశారని, ఇది అధికార పార్టీ రిగ్గింగ్ వ్యూహంలో భాగమని బీజేపీ నేత అమిత్ మాల్వీయ సంచలన ఆరోపణలు చేశారు. దీనిని ఆయన 'డైమండ్ హార్బర్ మోడల్' అని అభివర్ణిస్తూ, ప్రభావితమైన బూత్లలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) స్పందిస్తూ.. ఈవీఎం బటన్లపై టేపులు వేసినట్లు ఫిర్యాదులు వస్తే వాటిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే సదరు పోలింగ్ కేంద్రాల్లో ఖచ్చితంగా తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాగా, డైమండ్ హార్బర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దీపక్ కుమార్ హల్దార్ మరియు టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే పన్నా లాల్ హల్దార్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గతంలో అభిషేక్ బెనర్జీ ఇదే 'మోడల్'తో గెలిచారని బీజేపీ విమర్శిస్తుండగా, టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.

మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా ఎన్నికల సంఘం (EC),కేంద్ర బలగాల తీరుపై విరుచుకుపడ్డారు. తాను పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, ఎన్నికల పరిశీలకులు 'ఉగ్రవాదుల్లా' ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బలగాలు టీఎంసీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి ఓటర్లను భయపెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య పండుగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆమె ఆరోపించారు. ఒకవైపు బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని ఆమె విమర్శించగా, మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పందిస్తూ.. మమతా బెనర్జీ గూండాలను వెంటేసుకుని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని ఎదురుదాడికి దిగారు.

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం ఎన్నికల అధికారుల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిశీలకులు రాజకీయ ఒత్తిళ్లకు లోనై మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనికి కౌంటర్గా టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి భయంతోనే ఇటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తోందని, పోలీస్ అబ్జర్వర్లను సస్పెండ్ చేయాలని కోరడం వారి అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. మొత్తం మీద రెండో విడత పోలింగ్ హింసాత్మక ఘటనలు, తీవ్ర ఆరోపణలు మరియు ఈవీఎంల చుట్టూ తిరుగుతున్న వివాదాలతో బెంగాల్ రాజకీయాలను వేడెక్కించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu