మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరాన్పై దాడులను అమెరికా 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయితే, ఈ ఆకస్మిక పరిణామం వెనుక చైనా మాస్టర్ మైండ్ ఉందని ట్రంప్ స్వయంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
చైనా చొరవ లేకుండా ఇది అసాధ్యం: ట్రంప్
పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇరాన్, అమెరికా మధ్య చర్చలు కుదిర్చింది మేమే అని చెప్పుకుంటుంటే.. ఆ క్రెడిట్ మాత్రం ట్రంప్ చైనాకు ఇచ్చాడు. ఇరాన్ను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడంలో చైనా కీలక పాత్ర పోషించిందని ట్రంప్ స్పష్టం చేశారు. "చైనా చొరవ లేకపోతే ఈ కాల్పుల విరమణ సాధ్యమయ్యేది కాదు" అని ఆయన తన 'ట్రూత్అవుట్' సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ల అభ్యర్థన మేరకు, హోర్ముజ్ జలసంధిని తక్షణమే పునరుద్ధరించాలనే షరతుపై దాడులను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. చైనా నేరుగా రంగంలోకి దిగకుండా పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలను మధ్యవర్తులుగా వాడుకుంది. ఈ దేశాలతో ఇరాన్కు స్పష్టమైన సందేశాలను పంపింది. యుద్ధం తీవ్రతరమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఇది ఇరాన్కు కూడా నష్టమని చైనా ఒప్పించగలిగింది. బయటకు పాకిస్థాన్ ప్రధాన పాత్రధారిగా కనిపిస్తున్నప్పటికీ, అసలు సూత్రధారి చైనాయేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
చైనా ద్వంద్వ వైఖరిపై అమెరికా ఫైర్
ఒకవైపు చర్చల కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా, రష్యాతో కలిసి వీటో చేయడం గమనార్హం. దీనిపై అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ తీవ్రంగా మండిపడ్డారు. చైనా, రష్యాలు అత్యంత నీచ స్థాయికి దిగజారి ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయని, వరల్డ్ సప్లై చెయిన్ బంధించిన ఇరాన్ చర్యలను సమర్థిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
చైనా ఈ వ్యవహారంలో ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకుంటూనే, సంక్షోభాలను పరిష్కరించగల "బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తి"గా తనను తాను నిరూపించుకోవాలని చూస్తోంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. అన్ని పక్షాలు నిజాయితీతో వ్యవహరించి యుద్ధాన్ని ముగించాలని కోరారు.
పాకిస్తాన్ ప్రయోజనాలు:
పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వం వహించడానికి కొన్ని స్వార్థ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
చమురు రవాణా: హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఆ మార్గాన్ని తెరిపించడం పాకిస్తాన్కు అవసరం.
సరిహద్దు భద్రత: ఇరాన్తో పాకిస్తాన్కు దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అక్కడ యుద్ధం జరిగితే శరణార్థుల సమస్య, అంతర్గత అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది.
పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. అమెరికా ప్రతిపాదనలు 'అహేతుకం'గా ఉన్నాయని ఇరాన్ మొండివైఖరితో చర్చలకు రావడానికి నిరాకరిస్తోంది. పాకిస్తాన్కు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం ఉంది. ఇరాన్, సౌదీలపై దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ ఎవరి పక్షాన ఉండాలో తెలియని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొత్తంగా చెప్పాలంటే, ఈ సంక్షోభంలో పాకిస్తాన్ ఒక శాంతి దూతగా వ్యవహరిస్తూ, ఇరు దేశాల మధ్య యుద్ధం పెద్ద ఎత్తున చెలరేగకుండా తన దౌత్య పరపతిని ఉపయోగిస్తోంది.

