కడప జిల్లాలో అల్మాస్పేటలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఘటనకు ముందు నుంచే ఉద్రిక్త పరిస్థితులపై సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కడప టూటౌన్ సీఐ ప్రసాదరావుపై బదిలీ వేటు పడింది.
ఈ మేరకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలు జారీ చేశారు.
సీఐ ప్రసాదరావును కడప టూటౌన్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పులివెందుల ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. అల్మాస్పేట ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముందని ముందస్తు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చినప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో సీఐ విఫలమయ్యారని విచారణలో తేలినట్లు సమాచారం.
అల్లర్ల సమయంలో పోలీసులు సమయానికి స్పందించకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్వయంగా విచారణ చేపట్టి, సీఐ నిర్లక్ష్య వైఖరి కారణంగానే శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతిన్నట్లు నిర్ధారించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు అల్మాస్పేట అల్లర్ల ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

