Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించాలి

అమరావతిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించాలి

Satyam NEWS 3 weeks ago

మరావతి రాజధానిలో జర్నలిస్టుల కోసం ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సీనియర్ జర్నలిస్టులు కోరారు.

ఆదివారం అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి 30 ఎకరాల భూమిని కేటాయించిందని, అనంతరం సీఆర్డీఏ ఆధ్వర్యంలో బహుళ అంతస్తుల గృహ సముదాయాల నిర్మాణం కోసం ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నామని సమావేశంలో గుర్తు చేశారు. అనంతరం జీఓ ఎంఎస్ నెం.107 ద్వారా జర్నలిస్టులకు నాలుగు కేటగిరీల్లో హ్యాపీనెస్ట్ నమూనాలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సొసైటీ డైరెక్టర్ , విశాలాంధ్ర బ్యూరో చీఫ్ చావా రవి ప్రస్తుతం అమరావతిలో హ్యాపీనెస్ట్‌తో పాటు ఇతర గృహ నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టును కూడా తక్షణమే ప్రారంభించాలని, దీనిపై ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు కావడం, పేదలకు గృహాలు, హ్యాపీనెస్ట్, ఏపీఎన్‌ఆర్‌టీఐ ఐకాన్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తూ, జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టుకు కూడా అదే ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.

2019 నుంచి ఇప్పటి వరకు పలువురు జర్నలిస్టులు పదవీ విరమణ చేయడం, మరికొందరు కరోనా సమయంలో మరణించడం జరిగిందని, వారి కుటుంబాలు కూడా ఈ ప్రాజెక్టు అమలుపై ఆశగా ఎదురుచూస్తున్నాయని సమావేశం పేర్కొంది. అమరావతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ స్థాయి రాజధానికి తగిన విధంగా ప్రపంచంలోనే ఆదర్శప్రాయమైన జర్నలిస్టుల కాలనీని నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News